Wednesday, October 17, 2012

ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము

ప|| ఈరూపమై వున్నాడు యీతడే పరబ్రహ్మము | 
శ్రీరమాదేవితోడ శ్రీవేంకటేశుడు ||

చ|| పొదలి మాయాదేవిపట్టిన సముద్రము |
అదె పంచభూతాలుండే అశ్వత్థము | 
గుదిగొన్నబ్రహ్మాండాలగుడ్ల బెట్టెహంస | 
సదరపుబ్రహ్మలకు జలజమూలకందము ||

చ|| అనంతవేదాలుండేటిఅక్షయవటపత్రము |
ఘనదేవతలకు శ్రీకరయజ్ఞము | 
కనలుదానవమత్తగజసంహరసింహము |
మొనసి సంసారభారము దాల్చే వృషభము ||

చ|| సతతము జీవులకు చైతన్యసూత్రము|
అతిశయభక్తులజ్ఞానామృతము |
వ్రతమై శ్రీవెంకటాద్రి వరములచింతామణి | 
తతిగొన్న మోక్షపుతత్త్వరహస్యము||


శ్రీమతే రామనుజాయ నమ:
---------------------------
బ్రహ్మ - వ్యష్టి రూపముగను సమష్టి రూపముగను నుండు వ్యక్తావ్యక్త స్వరూపులగు చేనులను కల్యాణ గుణ సముదాయములచే వృద్ధిని పొందించుచు తానును స్వరూప రూప గుణ విభవాదులచే మాటి మాటికిని అభివృద్ధి చెందుచు వేదాంత వేద్యుడై వెలుగొందువాడు.

పరబ్రహ్మ అంటే - తన కన్న గొప్ప వాడు లేని పైన చెప్పిన బ్రహ్మ స్వరూపం కలవాడు

ఈ రూపమై - అంత గొప్ప వాడు ఇలా ఈ రూపం తో ఉన్నాడు. యే రూపం? - శ్రీ వేంకటేశుని రూపం ( దయ , సౌలభ్యం వంటి గుణాలతో ). మరి ఇతని లాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా? ఊహు లేరు - యెలా? " ఈతడే" - ఈ "యే"వకారం అంటే ఇతడొక్కడే ఆ పరబ్రహ్మం.ఇంకొకరు అలాంటి పరబ్రహ్మ లేరు. అట్టివాడు  మన కంటికి కనిపించే ఈ రూపం తో ఉన్నాడు. అలా ఆయన శుభాలు కలిగించే రమా దేవితో శ్రీ వేంకటాద్రి పైన - మన పాపాలను హరించే కొండపై ఈ రూపం తో ఉన్నాడు.
--------------------------------------------------------------------------------------------
ఆయన ఏ ఏ  రూపాలు దాల్చి యే యే కార్యాలు నిర్వహిస్తున్నాడొ సమగ్రం గా సృష్టి మొదలుకొని మోక్షం వరకు అన్నిటా తాను అనుప్రవేశం ఎలా చేసాడో వివరిస్తున్నారు.
------------------------------------------------

పొదలి మాయా దేవి పట్టిన సముద్రము
------------------------------------
పొదలి - ప్రకాశించు, వ్యాపించు, ఉప్పొంగు, వర్ధిల్లు, నివసించు, ఎగసిపడు

అతిశయం తో విజృంభించి వ్యాపించు ( ప్రకాశించు) యోగ మాయ అతడే. అనగా సృష్టి చేయాలని సంకల్పం కలిగిన వెంటనే తన నుండి మూల ప్రకృతి పుట్టును. దానినే ఇక్కడ మాయా దేవి గా అన్నమయ్య అభివర్ణించారు. ఇది యెలాంటిది? - పొదలు సముద్రం - ఉప్పొంగే, విజృంభించే సముద్రం - యెవరూ దానిని దాటటానికి సాధ్యం కానిది. ఇదే సంసార సాగరము.మొట్టమొదటి రూపము ఈ మూల ప్రకృతి - స్వామి తానే ఐ ఉన్నాడు...అంటే , అందులో తానే అనుప్రవేశం( అందులో దూరి, దానిని నియమించే వాడు) చేసి ఉన్నాడు.

అదె పంచభూతాలుండే అశ్వత్థము:
-----------------------------------
అశ్వత్థ:" - "ఇపుడు ఉండునది రేపు ఉండదు అనునంట్లు అనిత్యములగు అన్నిటి యందు అనుప్రవేశించి సమస్తమును ప్రవర్తింప చేయువాడు". ఇలా పంచభూతాలకు వాటి స్వరూప వికారం కలిగిస్తూ అశ్వత్థము గా ఉండు వాడు ఈతడే.

గుదిగొన్న బ్రహ్మాండాల గుడ్లు బెట్టే హంస:
------------------------------------------
గుదిగొను - లెక్కలేనన్ని, కోటాను కోట్లు, క్రిక్కిరిసిన, దట్టమైన

పంచీకరణం జరిగిన తర్వాత, బ్రహ్మాండాలను సృజిస్తాడు...యే రూపము తో? - హంస రూపం తో.
హంస - అందమైన నడక గలది అని అర్థం. అంటే? బ్రహ్మ అనేది తనతో చేరిన వారిని ఎలాగైతే పెద్దగా చేస్తుందో అలాగే తన భక్తులందరినీ తనలా నడుచుకొనేలా చేసేది. తనలా అంటే? - పరబ్రహ్మ కు 8 కల్యాణ గుణములు ఉంటాయి( అపహతపాప్మా, విజర, విమృత్యు, విశోక, విజిగిత్స, అపిపాస, సత్య కామ, సత్య సంకల్ప)...అవి అన్నీ తనను ఆశ్రయించిన వారికి ప్రసాదిస్తాడు.

ఇలాంటి హంస రూపమై బ్రహ్మాండాలు అనే గుడ్లు పెడతాడు. అవి యెన్ని? ఒకటా, రెండా?అండములు వేలాది, అంతమాత్రమే కాదు అట్టి అనేక వేల సహస్రములు - లెక్కకు మిక్కుటమగు బ్రహ్మండములు కోటానుకోట్లు స్వామి హంస రూపమై సృజిస్తాడు.హంస తెల్లగా ఉంటుంది....తెలుపుదనం శుద్ద సత్త్వమునకు సూచిక.....అలగే స్వామి ఎల్లప్పుడూ శుద్ద సత్త్వము తో కూడి ఉంటాడు. హంసకున్న మరో లక్షణం ఏమిటంటే, అది ఎప్పుడూ బురదను అంటుకోనే అంటుకోదు.....అలాగే స్వామి కూడా ఇంతా చేసినా కూడా ఈ సంసార పంకిలం (బురద) అంటుకోకుండా శుద్ద సత్త్వం తో అలరారుతూ ఉంటాడు.

సదరపు బ్రహ్మలకు జలజ మూల కందము:
-----------------------------------------
జలజ మూల కందము - బలిసిన తామర దుంప.

ఇపుడు, ఈ బ్రహ్మాండాలకు అధిపతిని నియమించాలి కదా,అది బ్రహ్మ పదవి. అందుకని పుణ్య విశేషం అధికం గా ఉన్న జీవాత్మలను ఎంపిక చేసి ఆ బ్రహ్మ పదవి లో కూర్చుండబెడుతాడు. అలాంటి బ్రహ్మలు కోటాను కోట్లు కదా...వారిని పుట్టించే మాంచి బలిసిన తామర దుంప రూపమై తానే ఉన్నాడు మన స్వామి. (ఇక సదరు బ్రహ్మ గారు సృష్టి చేయాలంటె ఆయనకు వేదాలు ఉపదేశించాలి కదా ! వేదాల సహాయం లేకుండా బ్రహ్మ గారు వ్యష్టి సృష్టి చేయలేరాయె...!) అందుకని,

అనంత వేదాలుండేటి అక్షయ వట పత్రము:
-----------------------------------------
వేదాలు ఎలాంటివి? - అపౌరుషేయాలు - అనగా ఏ  పురుషుడి నోటి నుండి వచ్చినవి కావు. మరి? అవి ఉండే స్థానం
పరమాత్మే...మరి పరబ్రహ్మ అనంతుడని కదా అంటారు....అందుకే అవి అనంతమైనవి. అలా ఆ వేదాల నివాస స్థానం ఈ తరిగిపోని (అక్షయ) వటపత్రం రూపమై ఉంటాడు. 

ఘన దేవతలకు శ్రీకర యఙము:
---------------------------------
బ్రహ్మ గారు రుద్రుణ్ణి, ప్రజా పతులను, ఇంద్రాది దేవతలను వారి పుణ్య విశేషాలను బట్టి సృష్టిస్తారు. మరి వారి 
జీవనాధారం ఏమిటి? యఙములే దేవతల ఆహారం, వారికి పుష్టి. కనుక స్వామి వారి పుష్టికై సుభకరమైన యఙ రూపం 
గా మారుతాడు. " యఙోవై విష్ణు:" - అలా దేవతల ఉనికికి తనే యఙ స్వరూపం ధరిస్తాడు.

కనలు దానవ మత్త గజ సంహార సింహము 
-------------------------------------------
కనలు - ప్రజ్వరిల్లు, ఆగ్రహించు, మండిపడు,ప్రేలు, కోపించు, గర్జించు

సింహ: - ఆశ్రితులకు శత్రువులనెడి మద గజములను గుండ పిండి చేయునట్టి భయంకరమగు సింహాకారం దాల్చు వాడు. - హరి భక్తులనియెరుగక శిక్షింప ఉద్యమించు యమాదులను హింసించు వాడు. దేవతలకు యఙములు ఋషుల ద్వారా జరుగుతుంటే అసురులు, దానవులు ఊరుకుంటారా? ఆ యఙములకు భంగం కలిగించి సృష్టి సమతౌల్యాన్ని భగ్నం చేయాలని చూస్తారు. అపుడు స్వామి ఆ మత్తెక్కిన దానవ గజములను ప్రజ్వరిల్లిన ఆగ్రహం తో సింహ రూపమై సంహరిస్తాడు.

మొనలు సంసార భారము దాల్చే వృషభము:
---------------------------------------------
మొనలు - ఉద్యమించు, ప్రయత్నించు, ప్రభవించు

వృషభము - తనకభిముఖులైన భాక్త వర్యులకు సంసార తాపముపశమించునట్లు ప్రతి దినమందును అమృతమును వర్షించి తడుపుచుండువాడు.

శత్రు పీడ వదిలింది, ఇక ఈ సంసార భారమును తాను సాత్త్విక వృషభమై ఉద్యమించి మోసే వాడవుతాడు. అలా ఈ సంసార చక్రాన్ని సత్వ గుణం తో వహించి స్థిమిత పడేలా చేస్తాడు.

సతతము జీవులకు చైతన్య సూత్రము:
---------------------------------------
ఈ సంసారం లోని జీవులు నడవాలంటే చైతన్యము ప్రధానం గా కావాలి. దానికి తాను యెల్లపుడూ సూత్రం గా ( ఆధారం గా ) ఉంటాడు. సూత్రం పుష్ప మాల లో పైకి కనిపించక పోయినా, ఆ పుష్ప మాల ఆధారం మాత్రం సూత్రమే (దారమే). 
అలాగే తనకన్నా అణు స్వరూపం ఇంకొకటి లేని పరమాత్మ జీవులందరిలో ఉండి వారిని నియమిస్తూ , నడిపిస్తూ ఉంటాడు. 

అతిశయ భక్తులకు ఙానామృతము:
-----------------------------------
అమృత:- తన భక్తులకు ముసలితనమును, మృత్యువును బాపి సర్వదా అనుభవించుచున్నను తనివి తీరక అమృతము వలె నిరతిశయ మాధుర్యముతో ఉండువాడు. అలా తను అంతరంగా ఇస్తున్న సూచనలను, బాహ్యం గా నడుచుటకు ప్రవర్తింపచేసిన శాస్త్రాలను యే జీవుడు ఆచరిస్తాడో అలాంటి అతిశయించిన (గొప్ప) భక్తులకు ఙానం అనే నిరతిశయ అమృత రూపం అవుతాడు....వారిని ఆనందింప చేస్తాడు.

వ్రతమై శ్రీ వేంకటాద్రి వరముల చింతామణి:
----------------------------------------------
శ్రీ వేంకటాద్రి - సుభాలు కలిగించి( శ్రీ), పాపాలను హరించేది ( వేంకటాద్రి) ..అలాంటి ఈ కొండపైన - చింతామణి - 
చింతించినది (కోరినది) ఇచ్చే మణి. ఇది యే ఒక్కరికేనా? - కాదుట...అలా ఇవ్వటం తన వ్రతమై ఉన్నాడట స్వామి. వ్రతం అంటే యేమిటి? - దీక్ష పట్టి చేయక పోయినా, కాస్త నియమాలు తప్పి అటు ఇటు గా చేసినా ఫలం ఇవ్వనిదో లేక విపరీత ఫలాలను ఇచ్చేదో కదా. మరి సృష్టి సంకల్పం దగ్గర నుండి ఇంతవరకు అన్ని రూపాలు ధరించాడు కదా! ఇంత శ్రమా ఇపుడు కోరినది ఇవ్వలేదనుకో - వ్రతం చెడిపోయి ఫలం దక్కదు. ఫలం యేమిటీట? - ఈ జీవాత్మ తన స్వరూపమునెరిగి స్వామి సన్నిధానం చేరి ఆయనతో సమంగా ఆనందించుట. మరి వ్రతం ఫలించాలి అంటే తప్పకుండా ఈ జీవులు అడిగినవన్నీ ఇవ్వాలి. అలా వ్రతం పట్టిన చింతామణి రూపమై ఈ శ్రీ వేంకటాద్రి మీద ఉన్నాడు.

తతిగొన్న మోక్షపు తత్త్వ రహస్యము:
------------------------------------
మరీ అంత సులభుడు - తతిగొన్న ( ప్రాచుర్యం పొందిన, చాలా గొప్ప) తత్త్వ రహస్యమట. చివరికి జీవులకు మోక్షం ప్రసాదించే గొప్ప తత్త్వ రహస్యము కూడా ఈయనే అయి ఉన్నాడు. అలాంటి రహస్యము రూపము కూడా తానే అయి ఉన్నాడు.కనుక జీవుల ఉన్నతి కొరకు - ఉన్నతి అంటే? - ప్రళయ సమయం లో నామ రూప విభాగ అనర్హం గా పడి ఉన్న జీవుల స్వరూపం వారికి తెలియచేసి, శరీరాన్ని ప్రసాదించి , వారు జీవించడానికి ఒక ప్రదేశం కల్పించి అన్నిటా తాను నిండి, వారికి శాస్త్రాన్ని ఇచ్చి తనతో ఉంటే వారికి కలిగే ఆనందాన్ని వారికి నిత్యమూ యే ఆటంకం లేకుండా ప్రసాదించటానికి ఇన్ని రూపాలు తానే అయి ఉన్నాడు. అటువంటి వాడు ఇక్కడ ఈ శ్రీ వేంకటాద్రి మీద ఉన్నాడు ఈ రూపమై .... సేవించండి ... తరించండి అని చెపుతున్నారు అన్నమయ్య వారు.

ఏవైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో క్షమించి దాసునికి తెలియజేయగలరు 
adiyen ramanuja dasan.

http://www.esnips.com/displayimage.php?pid=8280593